కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్ మండలం గుండి ప్రాథమికోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు DNR ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘విజయపథం సిరీస్ స్టడీ మెటీరియల్’ను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల విద్యాభ్యున్నతి లక్ష్యంగా ట్రస్ట్ అధినేత దొడ్డా ప్రతాప్ రెడ్డి రాష్ట్రంలోని ప్రముఖ ఉపాధ్యాయులతో కలిసి ఈ నాణ్యమైన మెటీరియల్‌ను రూపొందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మెటీరియల్ స్వీకరించిన విద్యార్థులు, పదవ తరగతి పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేస్తూ ప్రతాప్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మండల విద్యాధికారి రాథోడ్ సుభాష్, సెక్టోరియల్ అధికారి లతీఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత, గణిత ఉపాధ్యాయులు కాసం సంతోష్‌తో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. మెటీరియల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని వారు ఆకాంక్షించారు.