ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ ఏడాది 72వ ఉత్సవాల్లో భాగంగా 69 అడుగుల ఎత్తుతో \'పంచముఖ సంకటహర మహాగణపతి\' రూపంలో గణనాథుడు కొలువుదీరాడు. విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకోవడం ప్రారంభించారు. 5 ముఖాలు, 5 పడగల సర్పం, బహుళ హస్తాలతో సంకటాలను హరించే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గణపతికి ఒకవైపు 15 అడుగుల సోమనాథ జ్యోతిర్లింగం, మరోవైపు కాళికామాత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యావరణ హితంగా రూపుదిద్దుకున్న ఈ విగ్రహ నిర్మాణంలో సుమారు 30 టన్నుల నదీ మట్టి (రాజస్థాన్ బనాస్ నది నుంచి), 20 టన్నుల ఇసుక, 25 టన్నులకు పైగా స్టీల్తో పాటు గడ్డి, సేంద్రియ రంగులను ఉపయోగించారు.
ప్రఖ్యాత శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ పర్యవేక్షణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా కళాకారులు 3 నెలల పాటు శ్రమించి ఈ భారీ విగ్రహాన్ని రూపొందించారు.