ఎమ్మెల్సీ అనంతబాబుకి నో బెయిల్
NEWS Aug 17,2026 02:26 pm
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుడిగా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఆగస్టు 17 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా తన విధులు నిర్వర్తించేందుకు పరిమిత కాలానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు కోర్టును కోరారు. ఈ పిటిషన్పై ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు.అనంతబాబు తన పిటిషన్లో ఎమ్మెల్సీనని..శాసనమండలి సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలను, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. కోర్టు నిర్దేశించే షరతులకు లోబడి పూచీకత్తులు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని, సమావేశాలు ముగిసే వరకు మాత్రమే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.