‘అమరావతి’ కోసం చంద్రబాబు తపన
NEWS Aug 14,2026 02:58 pm
అమరావతి రాజధాని నిర్మాణం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతోంది. ప్రముఖ అంతర్జాతీయ దినపత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్టులు ముజీబ్ మాషల్, హరికుమార్ లు ఇటీవల అమరావతిని సందర్శించారు. సీఎం చంద్రబాబు తన కలల రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతున్న తీరుని స్వయంగా పరిశీలించి ప్రశంసలు కురిపించారు. క్వాంటమ్ వ్యాలీ, టెక్ హబ్, వాటర్ వేస్, సైకిల్ వేస్ తో అత్యంత సుందరంగా నిర్మిస్తున్నారు. 25 వేల మంది కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ కథనంలో అందించింది. పవిత్రమైన కృష్ణా నది ఒడ్డున గతంలో అరటి తోటలు, కూరగాయల పొలాలు ఉండేవి.. అక్కడ ఇప్పుడు క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకుంటోంది. భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించాలనే ఆశయం రూపుదిద్దుకుంటోంది. దక్షిణ భారతదేశంలో 5 కోట్ల జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని కొత్త రాజధాని నగరంగా నిర్మించడం అనేది ఒక అతి పెద్ద బాధ్యత. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి పట్టణ ప్రణాళికలో ఇదే భారీ ప్రయత్నం. 76 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించే స్వభావం ఉంది. 2029లో తన పార్టీ తిరిగి ఎన్నికలను ఎదుర్కొనే సమయానికి ఈ ప్రాజెక్టు తిరుగులేని వాస్తవంగా మార్చడానికి నిర్మాణ పనులకు గడువును నిర్ణయించారు. ప్రతిరోజూ 25 వేల మందికి పైగా కార్మికులు ఈ ప్రదేశంలో పని చేస్తున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ రూపొందించిన డిజైన్ ప్రకారం అమరావతి నగరం నిర్మితమవుతోంది. నగరం మధ్యలో ఎత్తైన టవర్లతో కూడిన అసెంబ్లీ భవనం ఉంటుంది. దాని చుట్టూ మంచినీటి సరస్సు ఉంటుంది. ఐదు పరిపాలనా కార్యాలయాలు ఎత్తైన టవర్లలో పనిచేస్తాయి. వీటిలో 16,000 మంది ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో అత్యంత ఎత్తైన భవనంలో సీఎంవో ఉంటుంది. దాని పైకప్పుపై హెలిప్యాడ్ కూడా ఉంటుంది. కొత్త నగరంలో 60 శాతం ప్రాంతం నీరు లేదా పచ్చదనంతో నిండి ఉంటుందని అంచనా. దాదాపు 2,000 మైళ్ల సైక్లింగ్ మార్గాలు కూడా ఇందులో ఉండనున్నాయి. నగరంలోని క్వాంటమ్ వ్యాలీ కోసం 50 ఎకరాల క్యాంపస్ కోసం కేటాయించారు. సింగపూర్ నమూనాతో కొత్త నగరం కోసం ప్రభుత్వం 30వేలమంది రైతుల నుంచి 35 వేల ఎకరాల భూమిని సేకరించారు. ప్రాచీన ఆంధ్రరాజ్యం రెండో శతాబ్దంలో ఉన్న రాజధాని పేరుని పెట్టారు. సింగపూర్ ప్రభుత్వ సాయంతో చంద్రబాబు అమరావతిని ముందుకి తీసుకెళుతున్నారు. 2019లో ఓటమి పాలైనా పడిన చోట మళ్ళీ కెరటంలా పైపైకి లేచారు చంద్రబాబు. అక్రమ కేసుతో చంద్రబాబుని రాజమండ్రి జైలుకి కూడా పంపారు.. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చాక ఐదేళ్ళపాటు ఆగిపోయిన అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మోడీ సహకారంతో అమరావతి గతిని మార్చేస్తున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా పార్లమెంట్ లో చట్టాన్ని ఆమోదించేలా ఆయన విజయం సాధించారు. క్వాంటమ్ వ్యాలీ ద్వారా చంద్రబాబు నాయుడు తన కొత్త రాజధానికి ఆర్ధిక శక్తిని, సాంకేతిక గుర్తింపును తీసుకురావాలని చూస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ కి సాఫ్ట్ వేర్ రంగం ఇచ్చిన గుర్తింపులాగే, క్వాంటమ్ టెక్నాలజీ అమరావతికి కొత్త ఆర్థిక ఇంజిన్ మారాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.