డేటా సెంటర్లతో విశాఖకు బిగ్ బూస్ట్
NEWS Aug 08,2026 02:12 pm
విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల రంగాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. గత కొన్నేళ్లుగా దేశంలో రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉన్నప్పటికీ, విశాఖలో వెలుస్తున్న భారీ డేటా సెంటర్ల ఎకో సిస్టమ్ కారణంగా నగర రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాలు మళ్లీ ఊపందుకుంటున్నాయని ప్రముఖ పరిశోధనా సంస్థ స్క్వేర్ యార్డ్స్ తన తాజా నివేదికలో విశ్లేషించింది.విశాఖలో రూపుదిద్దుకుంటున్న డేటా సెంటర్ల వల్ల నగరం చుట్టుపక్కల ఉద్యోగావకాశాలు వరదెత్తనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 51,800 మందికి ఉపాధి లభించనుండటం విశేషం. ఇందులో నేరుగా 3,240 మందికి ఐటీ ఉద్యోగాలు వస్తుండగా, అనుబంధ రంగాల ద్వారా మరో 48,600 మందికి అవకాశాలు దక్కనున్నాయి. ఈ ఎకో సిస్టమ్ విస్తరణతో విశాఖ రీజియన్లో విద్యుత్, ఫైబర్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్, కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లోకి భారీగా కొత్త పెట్టుబడులు రానున్నాయి.ఈ ఆర్థిక వికాసం విశాఖ రియల్ ఎస్టేట్ రంగానికి బిగ్ బూస్ట్గా మారనుంది. నగరానికి జనాభా రాక పెరగడంతో విశాఖ, దాని పరిసర ప్రాంతాల్లో ఏకంగా 2.33 కోట్ల చదరపు అడుగుల నివాస ప్రాంతానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని అంచనా. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా ఇళ్లతో పాటు వాణిజ్య స్థలాలు, గోడౌన్లు, రిటైల్ సెంటర్లకు కూడా గిరాకీ ఊహించని స్థాయిలో పెరగనుంది.విశాఖ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ గూగుల్ సంస్థ రూ. 1.35 లక్షల కోట్లతో ఇక్కడ భారీ డేటా హబ్ను నిర్మిస్తోంది. 2028 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 10,000 కోట్ల భారీ ఆదాయం సమకూరుతుందని స్క్వేర్ యార్డ్స్ పేర్కొంది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న ఈ డిజిటల్ విప్లవం నగర రూపురేఖలను మార్చడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే దిక్సూచిగా మారనుంది.