ములుగు జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత 10 గంటలుగా అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. దీంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఉన్న బొగత జలపాతం సందర్శనను అటవీ శాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ఉద్ధృతి తగ్గే వరకు ఎవరూ జలపాతం వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.