ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
NEWS Apr 20,2026 11:06 pm
ఎమ్మిగనూరు పట్టణంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో నిర్వహించిన దాడుల్లో ఈ ముఠా గుట్టు రట్టు అయినట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఎమ్మిగనూరు, ఆదోని, సిరిగుప్ప, పెద్దటుంబళం ప్రాంతాలకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఐపీఎల్ మ్యాచ్లపై ప్రత్యేక యాప్ ద్వారా భారీ స్థాయిలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి రూ.22 లక్షల నగదు, 4 సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.