కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళే భక్తులు వసతి కోసం నానా ఇబ్బందులు పడుతుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వసతికి ఢోకా లేకుండా అన్ని ఏర్పాట్లు చేప్తోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 15 నుంచి వైభవంగా నిర్వహించనుంది. ఈసారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొదటి రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తిరుమలలో భారీగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించనుంది. తిరుపతిలో భక్తుల వసతి కోసం నిర్మించిన శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలను సీఎం ప్రారంభిస్తారు. సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన ఈ వసతి సముదాయాల ద్వారా పది వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు. దీంతో వసతి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రూ.900 కోట్లకు పైగా విలువైన పనులు సకాలంలో పూర్తి చేయనున్నారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆధునికీకరించారు. ఇందుకు టీసీఎస్ సంస్థ రూ.145 కోట్ల విరాళం అందించింది. దీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. టీటీడీ, ఐవోసీఎల్ సంయుక్తంగా కాకులమాను తిప్పవద్ద రూ.12.85 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించి ట్రయల్రన్ నిర్వహిస్తున్నాయి.ఈ ప్లాంట్ నుంచి వకుళమాత అన్నప్రసాద కేంద్రానికి పైపులైన్ ద్వారా బయోగ్యాస్ పంపుతున్నారు.తిరుమల-పాపవినాశనం నూతన రోడ్డు ప్రారంభం కానుంది. ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. భక్తుల సౌకర్యార్థం రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చేందుకు అంగీకరించారు. తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. 50 మంది డ్రైవర్లను రిలయన్స్ సంస్థే నియమించి జీతభత్యాలు చెల్లించనుంది. ఇతర దాతలు అందించిన ఎలక్ట్రిక్ బస్సులనూ ప్రారంభించే అవకాశం ఉంది. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో రూ.120 కోట్లతో దాని పక్కనే నూతనంగా నిర్మించనున్న ఏఐ ఇంటిగ్రేటెడ్ హైటెక్ కిచెన్ భవనం ప్రారంభం కానుంది. శ్రీవారి లడ్డూప్రసాదం తయారీ ప్రారంభించి 310 ఏళ్లు అవుతున్న సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బంగారు నాణేన్ని తయారుచేయించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో సీఎంతో విడుదల చేయించేందుకు కసరత్తు చేపట్టారు.