ఏపీలో పట్టాలెక్కనున్న మెట్రో
NEWS Aug 10,2026 03:38 pm
ఏపీ వాసులకు గుడ్ న్యూస్. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమయ్యాయి. రెండు నగరాల్లో కలిపి తొలిదశలో రూ.21,616 కోట్ల భారీ పెట్టుబడితో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. విశాఖలో స్టీల్ప్లాంట్ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు మెట్రో అనుసంధానంతో ఉద్యోగులు, ప్రజల రాకపోకలు సులభతరం కానున్నాయి. విజయవాడలో గన్నవరం నుంచి కారిడార్ ఏర్పాటుతో విమానాశ్రయం, నగరం ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతాల మధ్య ప్రజా రవాణా అనుసంధానం బలోపేతం కానుంది. జాయింట్ వెంచర్ గా ఈ రెండు ప్రాజెక్టులూ చేపట్టనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 20%, కేంద్ర ప్రభుత్వం 20% చొప్పున నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన 60% నిధులు ఆర్థిక సంస్థల నుంచి సేకరించనున్నారు. కొన్ని విదేశీబ్యాంకులు రుణం సమకూర్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి.విశాఖ ఇప్పటికే పారిశ్రామిక, ఐటీ, పర్యాటక కేంద్రంగా ఎదుగుతోంది. విజయవాడ వాణిజ్య, రవాణా, పరిపాలనా కేంద్రంగా కీలకంగా ఉంది. ఈ రెండు నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గడంతో పాటు నగర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వరకు టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం మెట్రో రైల్ కార్పొరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా సోషల్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్ సర్వే ప్రారంభమైంది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరులో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. రెండు కారిడార్ల మెట్రో రైల్ ప్రాజెక్టుకు దాదాపు 80 ఎకరాలు అవసరం.